Sabarimala Temple: మండల-మకరవిళక్కు పూజల నేపథ్యంలో కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద భక్తుల రద్దీ పతాక స్థాయికి చేరిన వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయ్యప్ప దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న 58 ఏళ్ల మహిళ కుప్పకూలి మరణించారు. మరణించిన మహిళను కోజికోడ్ జిల్లా, కొయిలాండికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మంగళవారం (నవంబర్ 18, 2025) అయ్యప్ప దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉన్న సమయంలో ఆమె అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మరణించినట్లు జిల్లా అధికార వర్గాలు ధృవీకరించాయి.
ఇది కూడా చదవండి: Hyper Aadi: రాజమౌళి దేవుడిని అవమానించలేదు: హైపర్ ఆది
మండల-మకరవిళక్కు తీర్థయాత్ర ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే ఆలయాన్ని దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు సందర్శించారు. పంబ నుంచి సన్నిధానం వరకు భక్తులతో కిక్కిరిసిపోవడంతో, రద్దీ నియంత్రణ పోలీసులకు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. విపరీతమైన రద్దీ కారణంగా భక్తులు దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ కారణంగా, పవిత్రమైన 18 మెట్ల సమీపంలో భక్తులు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో, దాదాపుగా తొక్కిసలాట వాతావరణం నెలకొంది. క్యూలైన్లలో నీరు, ఆహారం లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు ఫిర్యాదులు వచ్చాయి.
