Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒకవైపు రాష్ట్ర పాలనపై దృష్టి సారిస్తూనే, మరోవైపు తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన గెలిచిన నియోజకవర్గం పిఠాపురంలో పార్టీ వ్యవస్థను సరిదిద్దేందుకు ఆయన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయడం, కష్టపడి పనిచేసిన వారికి సరైన గుర్తింపు ఇవ్వడం, క్షేత్ర స్థాయి కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత, పవన్ కల్యాణ్ పిఠాపురంలో పార్టీ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడానికి శ్రీకారం చుట్టారు.
ఫైవ్ మెన్ కమిటీలో మార్పు
గతంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్గా పనిచేసిన మర్రెడ్డి శ్రీనివాస్ను రెండు నెలల క్రితం ఆ బాధ్యతల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆ తరువాత, పార్టీ పనులను చూసుకోవడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ‘ఫైవ్ మెన్ కమిటీ’ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, తుమ్మల బాబు మరియు మర్రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
Also Read: Nara Lokesh: కృత్రిమ మేధతో పెరగనున్న ఉద్యోగాలు
అయితే, ఇటీవల కాలంలో మర్రెడ్డిపై పార్టీ కార్యకర్తల నుండి అనేక ఫిర్యాదులు రావడం, ఆయన పనితీరు పార్టీ కార్యక్రమాలకు అడ్డంకిగా మారుతున్నట్లు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ మరో కీలకమైన చర్య తీసుకున్నారు.
మర్రెడ్డి స్థానంలో ఓదూరి కిశోర్
పార్టీ అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, మర్రెడ్డి శ్రీనివాస్ను ‘ఫైవ్ మెన్ కమిటీ’ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మర్రెడ్డి స్థానంలో, పార్టీ కార్యకలాపాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్న ఓదూరి కిశోర్ను కొత్త సభ్యుడిగా నియమించారు.
ఓదూరి కిశోర్ చేబ్రోలు ప్రాంతంలో జనసేన పార్టీ సమావేశాలకు, కార్యకర్తల వసతికి, ఇతర సౌకర్యాలకు సహాయం అందిస్తూ పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా పిఠాపురంలో పార్టీ నిర్మాణం మరింత బలోపేతం అవుతుందని, రాబోయే రోజుల్లో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండుతుందని జనసేన నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
