Arun Jaitley Stadium: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోరమైన కారు పేలుడు సంఘటన నేపథ్యంలో, అరుణ్ జైట్లీ స్టేడియం దాని చుట్టుపక్కల ప్రాంతాలలో భద్రతను భారీగా పెంచారు. రంజీ ట్రోఫీ గ్రూప్ డీలో ఢిల్లీ, జమ్ము కశ్మీర్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ చివరి రోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టేడియం ప్రాంగణం వెలుపల అదనపు భద్రతా సిబ్బందిని మోహరించాల్సిందిగా ఢిల్లీ పోలీసు అధికారులను కోరనున్నట్లు ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) కార్యదర్శి శర్మ చెప్పారు. నేడు రంజీ ట్రోఫీ నాల్గవ రౌండ్ మ్యాచ్కు చివరి రోజు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో జమ్ము కశ్మీర్ జట్టు చారిత్రక విజయాన్ని అందుకోవడానికి ఇంకా 124 పరుగులు చేయాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Rajnath Singh: ఏ ఒక్కడిని వదిలిపెట్టం.. రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఆ జట్టు చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. సోమవారం సాయంత్రం 6:52 గంటలకు ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఢిల్లీ నగరాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పేలుడు ధాటికి ప్రజల శరీరాలు గాల్లోకి ఎగిరిపడటం, భారీగా మంటలు వ్యాపించడంతో ఈ ఘటనలో ప్రాణనష్టం భారీగా సంభవించింది. పేలుడు జరిగిన ప్రాంతంలో సాధారణంగా ఉగ్రదాడుల్లో కనిపించే విధంగా గుంత (Crater) ఏర్పడలేదు. అలాగే, గాయపడిన వారి శరీరాలలో మేకులు (nails) లేదా వైర్లు కనుగొనబడలేదు. ఉగ్రవాద దాడులలో సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ అంశం దర్యాప్తును కొత్త కోణంలోకి మళ్లిస్తోంది. ఈ విధ్వంసకర ఘటన తర్వాత, ఢిల్లీతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముంబై, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, కేరళ, చండీగఢ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో భద్రతను పెంచి, నిఘాను ముమ్మరం చేశారు.
