Harish Rao: బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డిపై, కాంగ్రెస్ మంత్రులు, ఇతర నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మరణంతో 11 రోజులపాటు ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. తాజాగా ఆయన ఎన్నికల ప్రచార గోదాలోకి దూకారు. వచ్చీరాగానే ఆయన దూకుడు పెంచారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో ప్రత్యారోపణలు చేశారు.
Harish Rao: కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యకపోతే పథకాలు ఆపేస్తామని సీఎం రేవంత్రెడ్డి అనడంపై హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పథకాలు ఆపేస్తానికి ప్రభుత్వం ఆయన అయ్య జాగీరా? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును ప్రజలకే ఇస్తున్నారని, అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. దీన్నిబట్టే రేవంత్రెడ్డి ఓటమి భయం పట్టుకున్నదని తెలుస్తున్నదని, అందుకే ప్రజలను ఆయన భయపెడుతున్నారని తెలిపారు.
Harish Rao: బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం వల్లే ఇప్పడు కాంగ్రెస్ మంత్రులు పరుగులు పెడుతున్నారని హరీశ్రావు తెలిపారు. పీజేఆర్కు మంత్రి పదవి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, ఆయన మరణానికి కారణమయ్యిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయనే సీఎం, కాంగ్రెస్ నేతలకు ఎన్టీఆర్, పీజేఆర్ గుర్తుకొస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికలు రాబట్టే మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాలనే సోయి వచ్చిందని చెప్పారు. ఇవన్నీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఒత్తిడి వల్లనే జరిగాయని చెప్పారు.
Harish Rao: కాంగ్రెస్ ఉన్నందుకే ముస్లింలు ఉన్నారని, కాంగ్రెస్ లేకుంటే ముస్లింలకు ఇజ్జత్ ఉండదని సీఎం రేవంత్రెడ్డి అనడంపైనా హరీశ్రావు అభ్యంతర వ్యక్తంచేశారు. ముస్లింలు ఆజాదీ కోసం యుద్ధం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని ప్రశ్నించారు. ఈ విషయంలో రేవంత్రెడ్డి కచ్చితంగా ముస్లింలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Harish Rao: కంటోన్మెంట్ ఉప ఎన్నిక ముందు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటికీ అమలు కాలేదని హరీశ్ రావు తెలిపారు. రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయని, వీధి దీపాలు వెలగడం లేదని, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గం నాశనం అయిందని విమర్శించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే 6,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పారని, రూ.23 కోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని, డిఫెన్స్ భూములను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు.
Harish Rao: రెండేండ్ల ఈ కాంగ్రెస్ అరాచక పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలే తప్పక బుద్ధి చెప్తారని హరీశ్రావు తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరో మూడేళ్లు రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వికాసం, రేవంత్రెడ్డి రెండేళ్ల పాలనలో అంతా విధ్వంసం అయిందని విమర్శించారు.
