Wife Murder: బెంగళూరులో సంచలనం సృష్టించిన డాక్టర్ కృతికా రెడ్డి (28) హత్య కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో మరణించినట్లు భర్త నమ్మించేందుకు ప్రయత్నించిన ఈ కేసు, పోలీసుల దర్యాప్తులో భర్తే నిందితుడని తేలడంతో కీలక మలుపు తిరిగింది.
మత్తు మందుతో హ*త్య, 6 నెలల తర్వాత అరెస్ట్
డాక్టర్ కృతికా రెడ్డి మరణాన్ని ఆమె భర్త, డాక్టర్ మహేంద్రా రెడ్డి (31) ఏప్రిల్ 21, 2025న సాధారణ అనారోగ్యంగా చూపించి అందరినీ మోసం చేసేందుకు ప్రయత్నించాడు.
వైద్య పరీక్షల్లో మరియు ఫోరెన్సిక్ రిపోర్టులో మత్తు మందు (ప్రొపోఫాల్ – అనస్థీషియా మందు) అధిక మోతాదు వల్ల కృతికా చనిపోయిందని తేలడంతో, కేసు అనుమానాస్పదంగా మారింది.
మహేంద్రారెడ్డి డాక్టర్ కావడంతో, అనస్థీషియా మందు అతడి వద్ద దొరికే అవకాశం ఉందని పోలీసులు అనుమానించారు. కడుపు నొప్పితో ఉన్న పేషెంట్కు అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఆరు నెలల దర్యాప్తు అనంతరం, అక్టోబర్ 15న డాక్టర్ మహేంద్రా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
పేమెంట్ యాప్లో ‘హత్య సందేశం’
విచారణలో వెలుగు చూసిన అత్యంత సంచలన విషయం ఏమిటంటే, హత్య తర్వాత మహేంద్రారెడ్డి తన ప్రియురాలికి పంపిన సందేశం. కృతికా చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత, మహేంద్రా తన ప్రియురాలికి “నీ కోసం నా భార్యను చంపేశా” అని మెసేజ్ చేశాడు.
ఇది కూడా చదవండి: The Girlfriend: ‘ది గర్ల్ఫ్రెండ్’ సెన్సార్ పూర్తి!
ఈ మెసేజ్ను వాట్సాప్ లేదా సాధారణ మెసేజ్లలో పంపితే ట్రేస్ అవుతుందని భయపడి, మహేంద్రారెడ్డి ఒక డిజిటల్ పేమెంట్ యాప్లో అతి తెలివిగా పంపినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఈ మెసేజ్ను కీలక ఆధారంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రియురాలిని ప్రశ్నించి, ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆమె పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
దర్యాప్తు ముమ్మరం
పోలీసులు మహేంద్రారెడ్డి నివాసంలో తనిఖీలు చేపట్టి, ల్యాప్టాప్లు, మొబైల్లు స్వాధీనం చేసుకున్నారు. డేటా రికవరీ కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు.
కృతికా తల్లిదండ్రులు సైతం తమ కూతురు హ*త్యకు కారణమైన మహేంద్రారెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు త్వరలో మొత్తం దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.

