Delhi: వీధి కుక్కల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ ప్రభుత్వాలకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. నవంబర్ 3న అందరూ వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) రూల్స్–2023 అమలుపై వివరాలతో అఫిడవిట్లు సమర్పించాలని గత ఆగస్టులోనే రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, చాలా రాష్ట్రాలు వాటిని పట్టించుకోలేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
“అధికారులు వార్తాపత్రికలు చదవడంలేదా? సోషల్ మీడియా చూడడంలేదా? మా ఆదేశాలు అందకపోయినా చర్యలు తీసుకోవాలి కదా!” అంటూ జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది.
పశ్చిమ బెంగాల్, తెలంగాణతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయని కోర్టు గుర్తించింది. “దేశంలో వీధి కుక్కల దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీనివల్ల విదేశాల్లో కూడా మన దేశ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. మేము కూడా వార్తా కథనాలు చదువుతున్నాం” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అలాగే, వివిధ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWA), వ్యక్తులు తమను కేసులో భాగస్వాములను చేయాలంటూ చేసిన పిటిషన్లపై కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. “దేశంలోని ప్రతి RWA ఈ కేసులో పార్టీలుగా చేరితే, మన ముందర కోట్లాది మంది నిలుస్తారు కదా? సహేతుకమైన సూచనలు చేయండి” అని కోర్టు సూచించింది.
చీఫ్ సెక్రటరీలు నవంబర్ 3న హాజరుకాకపోతే కఠిన చర్యలతో పాటు జరిమానాలు కూడా విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఢిల్లీ విషయంలో ఎంసీడీ నివేదిక సరిపోదని, అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
గత ఆగస్టు 22న సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు కుక్కల స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, షెల్టర్ల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 3న జరగనుంది.

