Hyderabad: డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులను సెప్టెంబర్ 26 నుంచి స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 447 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి అప్లికేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మేడ్చల్ యూనిట్ పరిధిలో ఉన్న 118 మద్యం దుకాణాలకు 20 అప్లికేషన్లు అందాయి. అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు నిర్వహకుల ఎంపికను అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో చేపట్టనున్నారు.
దరఖాస్తు ఫారంతో పాటు రూ. 3 లక్షల డీడీ లేదా రూ. 3 లక్షలు చలాన్ రూపంలో చెల్లించిన రశీదును జతపరచాలని ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. డీడీలు, చలాన్లను డీపీఓ (జిల్లా ప్రొహిబిషనర్ అండ్ ఎక్సైజ్ అధికారి) పేరుతో తీసుకోవాలని సూచించారు.
మొత్తం 2,620 మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.