Ktr: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ముందు విషప్రచారం చేసి, ఎన్నికల తరువాత కూడా కాళేశ్వరంపై కక్ష కట్టి సీబీఐ విచారణకు ఆదేశించారని ఆయన విమర్శించారు.
“వారం తిరగక ముందే మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తెస్తున్నామని చెప్పడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం. తల దగ్గర చేయాల్సిన శంకుస్థాపనను తోక దగ్గర చేస్తున్నారు. మల్లన్నసాగర్ వద్ద శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక గండిపేట వద్ద డ్రామా చేస్తున్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అని అన్న వారే ఈరోజు అక్కడి నుంచి హైదరాబాద్కు మంచినీళ్లు తెస్తున్నారు,” అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
అలాగే, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. “కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 240 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. సీబీఐని రాహుల్ గాంధీ తప్పుబడతారు. అదే సీబీఐకి విచారణను రేవంత్ అప్పగించడం ద్వంద్వ వైఖరే” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

