Nara lokesh: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో వినూత్న శకం ప్రారంభమైంది. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని సీకే దిన్నె ప్రాథమిక పాఠశాల ఆవరణలో **దేశంలోనే తొలి సౌరశక్తి ఆధారిత “సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్”**ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం ప్రారంభించారు. రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంటశాల ద్వారా వేలాది విద్యార్థులకు పరిశుభ్రమైన, రుచికరమైన, పౌష్టికాహార భోజనం అందించనున్నారు.
5 స్మార్ట్ కిచెన్ల ప్రారంభం
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో రెండేసి, కడపలో ఒకటి — మొత్తంగా ఐదు స్మార్ట్ కిచెన్లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ కింద వీటి ద్వారా 136 పాఠశాలలలోని 10,332 మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొంచిన 13 వాహనాల ద్వారా ఆహారం పాఠశాలలకు సరఫరా కానుంది.
రాష్ట్రవ్యాప్త ప్రణాళిక
“సీకే దిన్నె స్మార్ట్ కిచెన్ పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. దీని ఫలితాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం” అని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కడప జిల్లాలోని 11 మండలాల్లో 33 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి, 1,24,689 మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం అని తెలిపారు.
విద్యార్థులతో ముఖాముఖి
తరువాత లోకేశ్ పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు సెమిస్టర్ విధానం, కొత్త యూనిఫాంలు, రుచికరమైన భోజనంపై సంతోషం వ్యక్తం చేశారు. కంప్యూటర్ ల్యాబ్, కొత్త బెంచీలు, ఎత్తైన కాంపౌండ్ వాల్ అవసరమని విద్యార్థులు కోరగా, వాటిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
“ఈసారి పరీక్ష మీకే కాదు, నాకు కూడా. మీరు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలి. విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయం” అని లోకేశ్ అన్నారు.
ఉపాధ్యాయులకు సూచనలు
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణితో సమావేశమైన లోకేశ్, విద్యా ప్రమాణాల పెంపుకు సూచనలు కోరారు. ఉపాధ్యాయులపై అదనపు భారం మోపబోమని, విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని సూచించారు. అదే సమయంలో పాఠశాలలో ఆర్వో తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సబిత, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, ఎమ్మెల్యేలు చైతన్య రెడ్డి, మాధవీరెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
