Putta Krishna On Lands: కమలాపురం నియోజకవర్గంలో సైలెంట్గా సునామీ సృష్టిస్తున్నాడట ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి. అధిష్టానం తన మీద పెట్టుకున్న నమ్మకానికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారట ఈ యువ ఎమ్మెల్యే. గత ప్రభుత్వంలో లెక్కలేనన్ని కబ్జాలు. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేయాల్సిందే. అందులోనూ కమలాపురం అంటేనే ఆ నాడు కబ్జాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. సామాన్య కార్యకర్తకు సెంట్ స్థలం ఇవ్వలేని గత ప్రభుత్వం.. వైసీపీ బడా నేతలకు జో హుజుర్ అనేసింది. బడా బాబుల కనుసన్నల్లో పనిచేసిన అధికారుల భూదాహనికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. సామాన్యుడు పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో ఆఫీస్ల చుట్టూ తిరిగినా, భూములు కబ్జా అయ్యాయని ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే లేడు. అయితే.. తమ ప్రభుత్వం రాగానే కబ్జాలకు గురైన స్థలాలు తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కమలాపురం ఎమ్మెల్యే.. నేడు కార్యాచరణ మొదలు పెట్టారు. ఇప్పటికే భావన టౌన్ షిప్, పాలకొండలు, ఆజాద్ నగర్, చెర్లోపల్లిలో కబ్జాలకు గురైన భూములతో పాటూ.. వైసీపీ నేత సజ్జల ఆక్రమించిన అటవీ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: KTR BRS Vilinam Politics: ఆ సీసీ కెమెరా పుటేజీ లీకైతే కేటీఆర్ పరిస్థితి ఏంటి?
యువనేత పుత్తా కృష్ణ చైతన్యరెడ్డిపై అధిష్టానం ఎంత నమ్మకంతో టికెట్ ఇచ్చిందో, అంతే పట్టుదలతో ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ముఖ్యంగా పాదయాత్రలో నారా లోకేష్ నుంచి పొందిన స్ఫూర్తితో దూసుకుపోతున్నారు. జగన్ సొంత మేనమామపై విజయం సాధించి కమలాపురం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కమలాపురంలో కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములపై స్పెషల్ ఫోకస్ పెట్టి, అధికారులతో కబ్జా భూములపై నివేదికలు సిద్ధం చేయించడమే కాకుండా, కబ్జాలకు గురైన భూముల్లో ప్రభుత్వ బోర్డులు పెట్టించారు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి. కబ్జాలపై మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నామంటున్నారీ యువనేత.
ఇప్పటికే 150 కోట్ల విలువైన వందల ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం అయ్యాయంటే… ఇంకా ఎన్ని కోట్ల భూములు వైసీపీ నేతలు కబ్జా చేసారో అన్న సందేహం ప్రజల్లో ఉంది. ఏది ఏమైనా యువ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి కబ్జాలపై ఉక్కుపాదం మోపడం శుభపరిణామం.
