Miss Kavitha BRS: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో జాగృతి నేతలు ఆగ్రహంతో మల్లన్న కార్యాలయంపై దాడి చేయడంతో గన్మెన్ కాల్పులు జరపడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలు తగ్గెదేలే అన్న రీతీలో వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసినా… బీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించలేదు. కేవలం మండలి ప్రతిపక్ష నేత మధుసూథనాచారి మాత్రమే మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రటన ఇచ్చారు. అయితే గతంలో ఓ సందర్భంలో బీఆర్ఎస్ నేతలు చేసిన అతి అంతా ఇంతా కాదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో చేపట్టిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న ఇంగ్లాడ్కు చెందిన మిస్ మిల్లా మ్యాగీ.. అనూహ్యంగా మధ్యలోనే పోటీల నుండి తప్పుకుంటూ… ఇక్కడ తనను కొందరు అవమానించారని, తనను వేశ్యలాగా చూశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు అంతా మూకుమ్మడిగా ప్రెస్మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావుతో పాటు ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు. అతిధిగా వచ్చిన విదేశీ మహిళను అవమానించారనీ, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిందని విమర్శలు గుప్పించారు.
మిస్ మ్యాగీ విషయంలో అంతలా మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు… సొంత పార్టీ ఎమ్మెల్సీ, కేసీఆర్ గారాల పట్టి, కేటీఆర్ సహోదరి అయిన కవితపై… ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎందుకు స్పందించలేదు? ట్విట్టర్లో నిత్యం యాక్టీవ్గా ఉండే కేటీఆర్… కనీసం సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా స్పందించకపోవడం…. కవిత, కేటీఆర్ల మధ్య వివాదం తీవ్రతకు అద్దం పడుతోందంటున్నారు పలువురు విశ్లేషకులు. అసలు పార్టీకి, కవితకు సంబంధం లేదన్న తీరుగా బీఆర్ఎస్ వ్యవహారం కొనసాగుతోంది.
Also Read: Komatireddy Venkatreddy: తెలంగాణ సంక్షేమ చరిత్రలో కొత్త అధ్యాయం
తెలంగాణ బిడ్డ, కేసీఆర్ సొంత కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పార్టీ నేతలు స్పందించకపోవడంతో కవిత ఒంటరిగా మారారా? నేతలు స్పందించకపోవడానికి అధిష్టానం ఆదేశాలే కారణమా?పార్టీలో ఏం జరుగుతుందో తెలియక, ఎలా స్పందించాలో తెలియక కిందస్థాయి నేతలు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఖండించారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించకపోవడానికి కుటుంబ వివాదాలే కారణమని తెలుస్తోంది. కేసీఆర్కి కవిత బహిరంగ లేఖ రాయడం, అది బయటకు రావడంతో కుటుంబ విభేదాలు బయటపడ్డాయి. ఇప్పుడు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినా పార్టీ నేతలు ఎవరూ స్పందిచకపోవడానికి ఆ విభేధాలే కారణమని తెలుస్తోంది.
కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే కవిత గట్టిగా ప్రశ్నించారు. కేటీఆర్కి ఈ-కార్ రేసు వ్యవహారంలో నోటీసులు ఇస్తే సోషల్ మీడియా వేదికగా కవిత స్పందించారు. కానీ కవితపై అనుచిత వ్యాఖ్యలపై మాత్రం ఇటు కేసీఆర్ కుటుంబం కానీ, అటు పార్టీ నేతలు కానీ స్పందంచకపోవడం అంటే… ఆమెను పార్టీకి పూర్తిగా దూరం పెట్టినట్లేనని తెలుస్తోంది.
