AtchanNaidu ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రైతుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా మూడు వ్యవసాయ బోర్డులను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. గుంటూరులో మిరప బోర్డు, శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డు, చిత్తూరులో మామిడి బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారం, శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తోతాపురి మామిడి రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్న పరిస్థితిని అచ్చెన్నాయుడు వివరించారు. మార్కెట్లో ధర కిలోకు రూ.8కి పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12 మద్దతు ధరగా నిర్ణయించి, రూ.260 కోట్ల వ్యయంతో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేస్తోందని వివరించారు. ఈ ఆర్థిక భారం తీర్చడానికి కేంద్రం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే, వెనుకబడిన జిల్లాలకు మైక్రో ఇరిగేషన్ పథకం కింద రాయితీలను పెంచాలని, ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని కోరారు.అచ్చెన్నాయుడు చేసిన వినతులపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.