Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో ఉన్న అండ్రి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఎన్ కౌంటర్లో 30 మంది నక్సలైట్లు మృతి చెందారు. భద్రతా బలగాలకు చెందిన ఒక జవాన్ మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి..
బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్పార్క్ ఏరియాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఫిబ్రవరి 9న కూడా ఎదురుకాల్పులు జరిగి 31 మంది మావోయిస్టులు చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఫిబ్రవరి 9న జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎన్ కౌంటర్లలో 104 మంది మావోయిస్టు మృతి చెందారు.
Also Read: Crime News: భర్తను చంపి.. ప్రియుడితో హనీమూన్ కి వెళ్లిన భార్య
2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించిన నాటి నుంచి దండకారణ్యంలో కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేశారు. అబూజ్మఢ్ఏరియా చుట్టూ బేస్క్యాంపులను ఏర్పాటు చేశారు. ‘లొంగిపోండి.. లేదంటే చంపేస్తాం’ అంటూ మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఈ సంవత్సరం జరిగిన ఎన్కౌంటర్లలో 104 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా, 2024లో జరిగిన ఎన్ కౌంటర్లలో 217 మంది మావోయిస్టులు చనిపోయారు. భద్రతా బలగాల వ్యూహాత్మక దాడులతో మావోయిస్టులు చెల్లాచెదురు అవుతున్నారు. తలదాచుకునేందుకు దండకారణ్యం వదిలి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా నిఘావర్గాలు పేర్కొంటున్నాయి.
