Marks Tension: పరీక్షల్లో మార్కుల కోసం పిల్లలను టెన్షన్ పెట్టే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. వారు పెట్టె ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కథలు చాలా విన్నాం. అలానే పరీక్షల భయంతో ఇల్లు వదిలి పారిపోయిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మంగళూరులోఇటువంటి ఒక సంఘటన జరిగింది. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించాలనే ఒత్తిడితో ఒక విద్యార్థి ఇంటి నుంచి పారిపోయాడు. తరువాత అతని ఆచూకీ దొరికింది. కానీ, అతను తిరిగి ఇంటికి వెళ్ళను అంటూ రోదించడం అక్కడ అందరినీ వేదనకు గురిచేసింది.
17 ఏళ్ల ఆ విద్యార్థి దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాల్ పరంగిపేట గ్రామానికి చెందినవాడు. అతని తల్లిదండ్రులకు ఒకే ఒక కుమారుడు. అతను పియుసి రెండవ సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 25న ఫైనల్ సెమిస్టర్ పరీక్షకు హాల్ టికెట్ తెచ్చుకోవడానికి కళాశాలకు వెళ్లిన విద్యార్థి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఫిర్యాదుతో అలర్ట్ అయినా పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. అతన్ని పట్టుకునేందుకు ఎస్పీ నేతృత్వంలో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ అంశం అసెంబ్లీలోనూ ప్రతిధ్వనించింది.
ఇంతలో, విద్యార్థి తండ్రి కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తులు కామేశ్వర్ రావు, నాదాబ్ లతో కూడిన ధర్మాసనం విద్యార్థి పరిస్థితిపై నివేదిక దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇది జరిగిన తర్వాత, ఈనెల 8వ తేదీన, ఉడిపిలోని ఒక సూపర్ మార్కెట్లో చొక్కా కొనడానికి వచ్చిన విద్యార్థిని పోలీసులు గుర్తించారు. అతనిని మంగుళూరు తీసుకువచ్చారు. ప్రస్తుతం అతన్ని మంగళూరు బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచారు. పరీక్షకు భయపడి ఇంటి నుంచి వెళ్లిపోయానని ఆ విద్యార్థి ఎస్పీ యాదీష్తో చెప్పాడు.
ఇది కూడా చదవండి: Nadendla manohar: మే నెల నుంచి సన్న బియ్యం..
ఈ పరిస్థితిలో, నిన్న కర్ణాటక హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఆ విద్యార్థి తన తల్లిదండ్రులతో వెళ్లడానికి నిరాకరిస్తున్నాడు. అతని ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరమని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే, విద్యార్థిని రక్షించిన రోజున తన తల్లితో మొబైల్ ఫోన్లో మాట్లాడినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని విద్యార్ధి చెప్పాడనీ, ఆ విద్యార్థిని అతని తల్లిదండ్రులకు అప్పగించాలని ఆయన అన్నారు.
ఇరువైపుల వాదనలు విన్న తర్వాత, న్యాయమూర్తులు, “పరీక్షను సీరియస్గా తీసుకోకండి” అని అన్నారు. పరీక్ష గురించి మీరు ఎందుకు ఒత్తిడికి గురిచేస్తున్నారు? అంటూ విద్యార్థి తల్లిదండ్రులను ప్రశ్నించారు. ఈ విషయంపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు పేర్కొంటూ, పిటిషన్పై తదుపరి విచారణను తేదీని పేర్కొనకుండా వాయిదా వేశారు.
చిల్డ్రన్స్ హోమ్లో విద్యార్థినిని కలవడానికి మరియు మాట్లాడటానికి తల్లిదండ్రులకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. తల్లిదండ్రులు నిన్న తమ కొడుకును కలవడానికి మంగళూరు బయలుదేరారు. తన తల్లిదండ్రుల ప్రేమ తనకు లభించలేదని, పరీక్షలు రాయాలని, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని మాత్రమే బలవంతం చేశారని విద్యార్థి ఎస్పీ యాదీష్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.