Bandi Sanjay

Bandi Sanjay: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా?

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న విపక్ష నాయకులను అడ్డుకుని నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. దాడులు చేసేవారికి కొమ్ముకాస్తూ, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా కాంగ్రెస్ చెబుతున్న ‘ఇందిరమ్మ రాజ్యం’ అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
దాడులు చేసిన వారిపై చర్యలేవీ?” – బండి సంజయ్ నిలదీత..
నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ఇప్పటివరకు ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నేతలను ఎందుకు రిమాండ్ చేయలేదని నిలదీశారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా?..
రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కాంగ్రెస్ నేతల అరాచకాలకు వత్తాసు పలకడమేనా అని ధ్వజమెత్తారు. ప్రశ్నించే నాయకులను అక్రమంగా నిర్బంధిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బేషరతుగా విడుదల చేయాలి – తీవ్ర పరిణామాలు తప్పవు..
అక్రమంగా గృహనిర్బంధం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు పార్టీ నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, భవిష్యత్‌లో జరిగే ప్రతి పరిణామానికి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు పోలీసులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

గతంలో అహంకారంతో వ్యవహరించిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో, త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *