CP Radhakrishnan: భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల పాత్రపై కీలక ప్రసంగం చేశారు. ఏలూరు జిల్లా ముసునూరులోని ప్రముఖ వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ‘గౌర్మెట్ పాప్కార్నికా’ (Gourmet Popcornica) రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి నాన్-జీఎంవో (Non-GMO) హై-ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ వంగడాన్ని ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
“రైతన్నలే దేశానికి పట్టుగొమ్మలు” – ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు..
విత్తన ఆవిష్కరణ అనంతరం రైతులతో జరిగిన సదస్సులో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ..
-
వ్యవసాయ ప్రాధాన్యత: దేశానికి రైతులే నిజమైన వెన్నుముక. దేశ జనాభాలో దాదాపు 55 శాతం మందికి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలే ప్రధాన జీవనాధారంగా ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంలో వ్యవసాయ రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.
-
ఆధునిక వంగడాల అవసరం: జన్యుమార్పిడి లేని (Non-GMO), అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన నూతన పాప్కార్న్ మొక్కజొన్న విత్తనాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం ఎంతో అభినందనీయమని ఆయన ప్రశంసించారు. ఇది రైతులకు మెరుగైన ఆదాయాన్ని సమకూరుస్తుందని ఆకాంక్షించారు.
-
నమో డ్రోన్ దీదీ పథకం: వ్యవసాయంలో మహిళా రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకం ద్వారా మహిళా రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక స్వాలంబన చేకూరుతోందని ఉపరాష్ట్రపతి వివరించారు.
