Pawan Kalyan

Pawan Kalyan: ‘జయంత్’, ‘అభిమన్యు’ కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ స్వాగతం!

Pawan Kalyan: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అడవి ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో అటవీశాఖ కీలక చర్యలు చేపట్టింది. ఏనుగుల గుంపును అదుపు చేసేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రంగంలోకి దించింది.

పలమనేరు క్యాంప్ నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరిన ‘జయంత్’, ‘అభిమన్యు’ అనే రెండు కుంకీ ఏనుగులకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏపీ ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు.

1. కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ వీడ్కోలు!

మంగళగిరి చేరుకున్న ‘జయంత్’, ‘అభిమన్యు’ ఏనుగులకు పవన్ కల్యాణ్ పూలమాలలు వేసి, స్వయంగా చెరుకు గెడలను తినిపించి యాత్రకు వీడ్కోలు పలికారు. వీటిని మొదట పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంపునకు తరలిస్తారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని అదుపు చేయడానికి అటవీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జయంత్, అభిమన్యులు గతంలో కూడా పలు క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసిన అనుభవం ఉండటంతో అధికారులు మొదట వీటినే ఎంపిక చేశారు.

2. అటవీశాఖ అధికారులకు కీలక ఆదేశాలు

సరిహద్దు రాష్ట్రమైన ఒడిశా నుంచి ఏనుగుల గుంపులు ఏపీలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తున్నందున, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సమన్వయం చేసుకోవాలని అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు.ఏనుగుల దాడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైతే ఒడిశా నుంచి మరికొన్ని కుంకీ ఏనుగులను తీసుకురావాలని ఆదేశించారు. ఈలోగా మన దగ్గర ఉన్న కుంకీ ఏనుగుల సాయంతో జనవాసాల్లోకి వచ్చిన ఏనుగులను వీలైనంత త్వరగా తిరిగి దట్టమైన అడవుల్లోకి మళ్లించాలని అటవీశాఖ అధికారులకు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *