Konda Surekha: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఉన్న రాజకీయ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న (సోమవారం) వరంగల్ నియోజకవర్గ అభివృద్ధి ఇంకా ఉమ్మడి జిల్లా మాస్టర్ ప్లాన్పై మంత్రికి సమాచారం లేకుండానే అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించడమే ఈ వివాదానికి కారణమైంది.
ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి (AICC) అధికారికంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రికి రాసిన మూడు పేజీల లేఖలో ఆమె కడియం శ్రీహరి తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం నిబంధనలకు (రూల్స్ ఆఫ్ బిజినెస్) పూర్తి విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యంగా తాను చూస్తున్న దేవదాయ శాఖ విషయాల్లో కూడా ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడం సరికాదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీతో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇద్దరు కీలక నేతల మధ్య రేగిన ఈ లేఖల దుమారం ఇప్పుడు వరంగల్ జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్లోనూ పెద్ద సంచలనంగా మారింది. దీనిపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
