Bandla Ganesh: టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తనలోని ఉదారత్వాన్ని చాటుకుని మానవత్వాన్ని నిలబెట్టారు. అరుదైన వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై బాధపడుతున్న చిన్నారి నిరంజన్ను పరామర్శించేందుకు ఆయన తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. హనుమాన్ నగర్లోని బాలుడి నివాసానికి చేరుకున్న బండ్ల గణేష్.. నిరంజన్తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడొద్దని ధైర్యం చెబుతూ, ఆ కుటుంబానికి తామున్నామనే కొండంత భరోసా ఇచ్చారు.
రూ. 5 లక్షల ఆర్థిక సాయం – కారు కావాలన్న చిన్నారి..
ఈ పర్యటన సందర్భంగా బండ్ల గణేష్ తన సొంత నిర్మాణ సంస్థ ‘పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్’ తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును చిన్నారి తల్లిదండ్రులు రాంగోపాల్ చారి, మానసలకు అందజేశారు. ఈ మొత్తాన్ని బాబు భవిష్యత్తు అవసరాల కోసం అతని పేరు మీదనే ఫిక్స్డ్ డిపాజిట్ (FD) చేయాలని వారికి సూచించారు.
పవన్ కళ్యాణ్ స్ఫూర్తి – భువనేశ్వరి బర్త్ డే స్పెషల్..
ఆర్థిక సాయం అనంతరం నిర్మాత బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ అత్యంత ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు:
నాకు దైవసమానులైన పవన్ కళ్యాణ్ గారు ఇటీవల హనుమకొండ పర్యటనలో నిరంజన్ను పరామర్శించినప్పుడే ఈ బాబు పరిస్థితి నా దృష్టికి వచ్చింది. ఆయన భక్తుడిగా, పవన్ కళ్యాణ్ గారు చూపిన సేవా స్ఫూర్తితోనే నా వంతు ఉడతా భక్తిగా ఈ సహాయం చేయడానికి ముందుకు వచ్చాను. మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి పవన్ కళ్యాణే కారణం అని బండ్ల గణేష్ భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రస్తుతం తన కుమార్తె వివాహ పనులతో అత్యంత బిజీగా ఉన్నప్పటికీ, ఎలాగైనా నిరంజన్ కుటుంబానికి సాయం అందించాలని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.
ఈ రోజు నారా భువనేశ్వరి గారి జన్మదినం కావడం విశేషమని, ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ఐదు లక్షల చెక్కును నిరంజన్ కుటుంబానికి అందించడం తనకు ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇస్తోందని బండ్ల గణేష్ పేర్కొన్నారు.
ఇక్కడికి తాను కేవలం బాబును చూసి మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి మాత్రమే వచ్చానని, ఈ వేదికపై ఎలాంటి రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు. నిరంజన్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ముగించారు.
