Hyderabad: హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం సాయంత్రం భాగ్యనగర వ్యాప్తంగా కుండపోతగా వాన పడటంతో చాలా రోడ్లు జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే పాతబస్తీలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో కరెంట్ షాక్కు గురై ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.
కురిసిన భారీ వర్షం కారణంగా చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లోని రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. వాన ధాటికి అక్కడి రోడ్డుపై కరెంట్ తీగలు తెగిపడ్డాయి. అయితే, రోడ్డుపై నీరు ఎక్కువగా ఉండటంతో ఆ ప్రమాదాన్ని గమనించని బాధితులు, తాము ప్రయాణిస్తున్న ఆటోను పక్కకు ఆపారు. అనంతరం వారు ఆటోలో నుంచి కిందకు దిగుతుండగా.. నీటిలో పడి ఉన్న లైవ్ కరెంట్ వైర్లను తాకారు. దీంతో ఒకరిని కాపాడబోయి మరొకరు.. ఇద్దరూ తీవ్రమైన కరెంట్ షాక్కు గురై స్పాట్లోనే ప్రాణాలు విడిచారు.
ఈ ప్రమాదంపై స్థానికులు వెంటనే పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ముందుగా ఆ ప్రాంతంలో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఆ తర్వాత యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కళ్లముందే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో చాంద్రాయణగుట్ట ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘోర పరిణామంతో భారీ వర్షాల సమయంలో ప్రజలు, వాహనదారులు రోడ్లపై వెళ్లేటప్పుడు ముఖ్యంగా కరెంట్ స్తంభాలు, వైర్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
