Nara Lokesh

Nara Lokesh: కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్‌, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర లాడిల్ పేలుడు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్పందించిన రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి మంగళవారం నాడే విశాఖపట్నం చేరుకున్నారు.

విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH) కి వెళ్లిన మంత్రులు.. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, అలాగే మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

బాధితులకు భరోసా.. మెరుగైన వైద్యానికి ఆదేశాలు:

కేజీహెచ్ ఆసుపత్రిలోని బర్న్స్ (గాయాల) వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురు కార్మికులను మంత్రి నారా లోకేష్ స్వయంగా కలిసి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులకు ఎలాంటి లోటు రాకుండా అత్యుత్తమ, మెరుగైన వైద్య సేవలను (Advanced Medical Care) అందించాలని కేజీహెచ్ సూపరింటెండెంట్  అలాగే ప్రత్యేక వైద్య బృందాన్ని లోకేష్ ఆదేశించారు. అవసరమైతే బాధితులను మెరుగైన చికిత్స కోసం ఇతర కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు.

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కార్మికుల కుటుంబ సభ్యులను లోకేష్ ,శ్రీనివాసవర్మ ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది:

పరామర్శ అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన భారీ సహాయక ప్యాకేజీ (రూ. 25 లక్షల పరిహారం, శాశ్వత ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య) సత్వరమే అందేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్లాంట్‌లో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *