Pandu Master: డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ (Dhee) ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దురదృష్టకర ఘటనతో ఆయన అభిమానులు, బుల్లితెర వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమ్మవారి ఉత్సవాలు ముగించుకుని వస్తుండగా..
సమాచారం ప్రకారం.. పండు మాస్టర్ తన డ్యాన్స్ బృందంతో కలిసి విశాఖ జిల్లా తగరపువలసలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో ఒక ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ షో ముగిసిన అనంతరం రాత్రి తమ కారులో తిరిగి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే ఆనందపురం పరిసర ప్రాంతాల్లోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది.
అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే?
ప్రయాణం మధ్యలో పండు మాస్టర్ టీమ్లోని ఒక సభ్యుడు అస్వస్థతకు (Vomitings/Illness) గురికావడంతో, డ్రైవర్ కారును రోడ్డు పక్కన ఆపాడు. ఆ సమయంలో పండు మాస్టర్ కారులో నుంచి కిందకు దిగి రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు.
సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఒక కోళ్ల వ్యాన్ నియంత్రణ కోల్పోయి, రోడ్డు పక్కన నిలిచి ఉన్న పండు మాస్టర్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ఘాతానికి కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతినగా.. కారు పక్కనే నిలబడి ఉన్న పండు మాస్టర్ పైకి ఆ వ్యాన్ దూసుకెళ్లడంతో ఆయనకు శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి.
ఆసుపత్రికి తరలింపు.. పోలీసుల దర్యాప్తు!
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు, ఆయన సహచర సిబ్బంది అప్రమత్తమై తీవ్ర రక్తస్రావమైన పండు మాస్టర్ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కోళ్ల వ్యాన్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా? లేక డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

