Benguluru: రాజకీయ నాయకులు లేదా వివిఐపి (VVIP)లు రోడ్డుపై వెళ్లేటప్పుడు భద్రత కోసం ట్రాఫిక్ను నిలిపివేయడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. దీనివల్ల సాధారణ ప్రజలు, ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారు, అత్యవసర పనుల్లో ఉన్నవారు చాలా ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా బెంగళూరు నగరంలో ఇలాంటి ఒక ఘటనే జరిగింది. కర్ణాటక గవర్నర్ కాన్వాయ్ వెళ్తుందనే కారణంతో పోలీసులు దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ను నిలిపివేశారు.
అయితే, అదే సమయంలో ఓ వ్యక్తి గర్భవతిగా ఉన్న తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్తున్నాడు. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోవడంతో సగం దారిలోనే వాహనాలు ఆగిపోయాయి. ఎంతసేపటికీ ట్రాఫిక్ కదలకపోవడంతో ఆ భర్తకు తీవ్ర ఆగ్రహం, ఆందోళన కలిగాయి. తన భార్య ప్రాణం కంటే వీఐపీల ప్రయాణమే ఎక్కువైందా అని ప్రశ్నిస్తూ, అతను నేరుగా గవర్నర్ కాన్వాయ్ వచ్చే రోడ్డుపైనే కూర్చొని ధర్నాకు దిగాడు.
అక్కడే ఉన్న పోలీసులు అతడిని వారించడానికి ప్రయత్నించినప్పటికీ, తన భార్యకు వైద్యం అందేలా ట్రాఫిక్ క్లియర్ చేసేవరకు అక్కడి నుంచి కదిలేది లేదని తెగేసి చెప్పాడు. బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో ఇప్పటికే నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి సమయంలో గంటల తరబడి రోడ్లు మూసేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని పోలీసులను నిలదీశాడు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, ఒక వైపు నుంచి వాహనాలు వెళ్లేలా దారిని క్లియర్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వీఐపీల సౌకర్యం కోసం సామాన్య ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఏంటని ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తున్నారు. అత్యవసర సమయాల్లోనైనా ఇలాంటి “వీఐపీ సంస్కృతి”ని పక్కన పెట్టి సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Will roads in India be closed for VVIP ⁉️
A man carrying his pregnant wife got stuck in a traffic jam. After waiting for half an hour, he became angry and sat on a dharna on the road.
Bengaluru for Governor’s VVIP movement. pic.twitter.com/nC5uml5PcZ
— Shruti Dhore (@ShrutiDhore) June 1, 2026
