Harish Rao: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావు (Harish Rao) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ‘టిజిఆర్పిడిసిఎల్’ (TGRPCL / RPDCL – రైతు డిస్కాం) ఏర్పాటు నిర్ణయాన్ని ఒక “తుగ్లక్ చర్య”గా ఆయన అభివర్ణించారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు, ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 8 (GO Ms No. 8) ఆధారంగా లెక్కలు, పక్కా ఆధారాలను బయటపెడుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
జీవో నంబర్ 8 అసలు నిజం: 24 గంటల కరెంట్కు మంగళం!
హరీష్ రావు ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 8 ని ప్రదర్శిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. “నేను రేవంత్ రెడ్డిలాగా బట్టకాల్చి మీదేసే అబద్ధాలు మాట్లాడను. ఏది మాట్లాడినా ఆధారాలతో, లెక్కలతోనే మాట్లాడతాను. ప్రభుత్వం తెచ్చిన మూడో డిస్కాం (RPDCL) కు కేవలం ‘రిన్యూవబుల్ ఎనర్జీ’ (సౌర విద్యుత్ / సోలార్ పవర్) మాత్రమే కేటాయిస్తామని ఈ జీవోలో స్పష్టంగా రాశారు. థర్మల్ పవర్, హైడల్ పవర్ దీనికి ఇవ్వరు.
సోలార్ పవర్ అనేది పొద్దున సూర్యోదయమయ్యాక 7 గంటలకు మొదలై, సాయంత్రం 5 లేదా 6 గంటలకే ముగిసిపోతుంది. అంటే రోజుకు కేవలం 8 నుండి 9 గంటలు మాత్రమే కరెంట్ అందుబాటులో ఉంటుంది. దీని అర్థం ఏంటంటే.. ఈ జీవో ద్వారా రేపు రాష్ట్రంలో రైతులకు కేవలం 8 నుండి 9 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా చెప్పకనే చెప్పింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 24 గంటల ఉచిత విద్యుత్తుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది.
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ సవాల్!
రాష్ట్రంలో కరెంట్ పరిస్థితిపై ముఖ్యమంత్రికి హరీష్ రావు ఒక పవర్ ఫుల్ ఛాలెంజ్ విసిరారు.. “రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే.. నేను తెలంగాణ రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతా, లేకపోతే ఓట్లు అడగను అని బాండ్ పేపర్ రాసి చెప్పగలరా? ఐ యామ్ ఛాలెంజింగ్ హిమ్. ఇవాళ రాష్ట్రంలో ఏ ఊరికైనా పోదాం. నేను స్వయంగా నర్సాపూర్, జహీరాబాద్, సిద్దిపేట సబ్స్టేషన్లకు వెళ్లాను. ఎక్కడా రైతులకు 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. ఇక ఈ కొత్త డిస్కాం వస్తే అది 8 గంటలకే పరిమితం కాబోతోంది.
కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 8 గంటలు, గుజరాత్లో 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని, రేపు తెలంగాణలో కూడా అదే గుజరాత్, కర్ణాటక మోడల్ తీసుకురావడానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
ఈఆర్సీ (ERC) ముందు కాంగ్రెస్ అధికారిక వాదన: ‘3 గంటలు చాలు’
సీఎం కాకముందు రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల కరెంట్ చాలన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున, అధికారిక హోదాలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు విద్యుత్ నియంత్రణ మండలి (ERC) ముందుకు వెళ్లి.. రైతాంగానికి 3 గంటల కరెంట్ ఇస్తే చాలని వాదనలు వినిపించారు. ఈఆర్సీ ముందు ఈ మినిట్స్ అధికారికంగా రికార్డై ఉన్నాయి. రైతులపై రేవంత్ రెడ్డికి ఉన్న ప్రేమ నేతిబీరకాయలో నెయ్యి చందమే. ఈ డిస్కాం రైతుల పాలిట ఉరిగా మారబోతోంది అని హరీష్ రావు విమర్శించారు.
సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులకు కోతల ముప్పు!
రైతు డిస్కాం కింద కేవలం వ్యవసాయాన్నే కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, మిషన్ భగీరథ లాంటి తాగునీటి పథకాలను కూడా చేర్చడాన్ని హరీష్ రావు తప్పుపట్టారు.
-
లిఫ్ట్ ఇరిగేషన్లు మూతపడతాయి: కాళేశ్వరం, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు రౌండ్ ద క్లాక్ (24 గంటలు) నడవాలి. వరద వచ్చినప్పుడు రప్పరప్ప నీటిని గుంజుకుని రిజర్వాయర్లు నింపుకోవాలి. రాత్రి పూట సోలార్ పవర్ ఉండదు కాబట్టి మోటార్లు నడపలేరు. పైగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నడిపితే మోటార్లు పూర్తిగా ఖరాబవుతాయని ఇంజనీర్లు చెబుతున్నారు. దీనివల్ల కృష్ణా, గోదావరి జలాలు ఆంధ్రాకు జారిపోతాయి తప్ప మన రైతులకు నీళ్లు రావు.
-
తాగునీటి కటకట: హైదరాబాద్కు లేదా ఏ జిల్లాకైనా మిషన్ భగీరథ నీళ్లు రావాలంటే ఎల్లంపల్లి, సాగర్, సింగూరుల నుండి మోటార్లు రోజుకు 18 నుండి 20 గంటలు నడవాలి. ఆర్పిడిసిఎల్ కింద సోలార్ పవర్ ఇస్తే, రేపు మబ్బులు పట్టినప్పుడు లేదా శీతాకాలంలో తాగునీటి పంపింగ్ ఆగిపోయి ప్రజలు మంచినీళ్లకు కూడా కటకటలాడాల్సి వస్తుంది.
డబుల్ లైన్ల భారం.. పబ్లిక్ మనీ వేస్ట్!
ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 సెక్షన్ 43 ప్రకారం వినియోగదారుడు కోరిన చోట కనెక్షన్ ఇవ్వాల్సిందేనని, కానీ ప్రభుత్వం కొత్త నిబంధనలతో గందరగోళం సృష్టిస్తోందని హరీష్ రావు అన్నారు.
మన ఊర్లలో ఇర్కోడు పక్కన హనుమంతపల్లి లాంటి గ్రామాల్లో బావుల కాడే ఇల్లు కట్టుకుని రైతులు ఉంటారు. అక్కడ చిన్న పౌల్ట్రీ షెడ్లు పెట్టుకుంటారు. రేపు కొత్త రూల్ ప్రకారం.. బాయికాడ అగ్రికల్చర్ కనెక్షన్ ఆర్పిడిసిఎల్ కింద ఉంటుంది, పక్కనే ఉన్న ఇంటికి లేదా పౌల్ట్రీకి కరెంట్ కావాలంటే ఎస్పిడిసిఎల్ లో అప్లై చేసుకోవాలి. ఎస్పిడిసిఎల్ వాడు ఊరి సబ్స్టేషన్ నుండి 12 పోల్స్ వేసి వైర్లు లాగడానికి రైతుల దగ్గరే పైసలు వసూలు చేస్తాడు. దీనివల్ల పొలాలు ఖరాబవుతాయి, ప్రజల సొమ్ము వృథా అవుతుంది. దీనికోసం మళ్లీ సపరేట్ స్టోర్స్, ఆడిట్ టీమ్స్, థెఫ్ట్ స్క్వాడ్స్ పెట్టాలి. ఇదంతా పబ్లిక్ మనీ వేస్ట్ చేయడం కాదా? గిరిజనులు, లంబాడీలు తండాల్లో బావుల కాడే ఇళ్లు కట్టుకుంటారు, రేపు వారి పరిస్థితి ఏంటి?” అని ప్రశ్నించారు.
అసెంబ్లీ పెట్టి చర్చించుదాం రండి!
ఈ మొత్తం వ్యవహారం వెనుక విద్యుత్ రంగాన్ని ‘ప్రైవేటీకరణ’ (ముంబైలో అదానీ, టాటాలకు అప్పగించినట్లు) చేసే పెద్ద కుట్ర దాగి ఉందని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో 70 నుండి 80 లక్షల మంది రైతాంగానికి సంబంధించిన ఇంతటి కీలకమైన సమస్యపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి, దీనిపై బహిరంగ చర్చ పెట్టాలని, నిజా నిజాలు ఏంటో అసెంబ్లీ సాక్షిగా తేల్చుకుందామని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి డిమాండ్ చేశారు.
