HYDRAA: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ‘హైడ్రా’ (HYDRA) అధికారులు తమ చర్యలను మరింత వేగవంతం చేశారు. ఇందులో భాగంగా నార్సింగి పరిధిలోని ప్రముఖ ముష్కి చెరువును కాపాడేందుకు అధికారులు శనివారం ఉదయం నుంచే రంగంలోకి దిగారు. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో దాదాపు 10 ఎకరాల మేర భూమి ఆక్రమణకు గురైనట్లు హైడ్రా, ఇరిగేషన్ శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో చెరువు సరిహద్దులను పక్కాగా కొలిచి, ఆక్రమణలు జరగకుండా చుట్టూ కంచె వేసే పనులను ప్రారంభించారు. ఎలాంటి గొడవలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ పనులు చకచకా సాగుతున్నాయి.
ఈ ముష్కి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాలకు, ఇతర నిర్మాణాలకు అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఆక్రమిత ప్రాంతాలను 10 రోజుల్లోగా ఖాళీ చేయాలని గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత రెండు నెలలుగా నివాసితులకు, భూ యజమానులకు పలుమార్లు ముందస్తు సమాచారం అందించామని.. స్థానికుల అభ్యర్థన మేరకు ఇచ్చిన చివరి అవకాశం కూడా ముగిసిందని అధికారులు చెబుతున్నారు. చెరువు భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వ భూములను, నీటి వనరులను కాపాడటమే తమ ముఖ్య ఉద్దేశమని.. ఆక్రమణలను పూర్తిగా తొలగించి చెరువులను మళ్లీ పాత రూపంలోకి తెస్తామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. నార్సింగిలోని మై హోమ్ అవతార్ సమీపంలో ఉన్న ఈ ముష్కి చెరువు చుట్టూ కంచె వేస్తుండటం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రకృతిని, చెరువులను కాపాడేందుకు ప్రభుత్వం మరియు హైడ్రా తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నారు.
