Bandi Bhagirath: తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్కు చుక్కెదురైంది. పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర బెయిల్ లేదా అరెస్ట్ నుండి రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, తుది తీర్పును వచ్చే వారానికి వాయిదా వేసింది.
అరెస్ట్ నుండి రక్షణ కల్పించాలన్న న్యాయవాది
ఈ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో గురువారం ఇరుపక్షాల తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. భగీరథ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తూ.. పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తామని, అందువల్ల పిటిషన్పై తుది నిర్ణయం వచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు (Interim Protection) జారీ చేయాలని కోర్టును కోరారు.
అయితే, ఈ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించలేదు. కేసు తీవ్రతను బట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణ సందర్భంలోనే పూర్తి స్థాయి పరిశీలన జరిపి తుది ఉత్తర్వులు జారీ చేస్తామని బెంచ్ పేర్కొంది.
వచ్చే గురువారం తుది తీర్పు?
హైకోర్టులో ఈ పిటిషన్కు సంబంధించిన అన్ని రకాల వాదనలు ముగిశాయి. లీగల్ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. హైకోర్టు ఈ కేసులో వచ్చే గురువారం తన తుది తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. అప్పటివరకు భగీరథ్కు ఎలాంటి న్యాయపరమైన ఉపశమనం లభించకపోవడంతో ఈ వ్యవహారం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
