Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గ రూపురేఖలు మార్చే విధంగా దాదాపు రూ. 364 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, ఆధ్యాత్మిక రంగాలకు పెద్దపీట వేస్తూ ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆధ్యాత్మిక నిలయంగా కొడంగల్ను తీర్చిదిద్దేందుకు సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సుమారు రూ. 110 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేస్తారు. అలాగే కోస్గిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి రూ. 2 కోట్లు, దౌల్తాబాద్లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి రూ. 2.14 కోట్లు కేటాయించి, ఆ పనులను కూడా ప్రారంభించనున్నారు. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశం.
మరోవైపు, నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భారీ అడుగు వేసింది. దాదాపు రూ. 250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 430 పడకల అత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే స్థానికులు వైద్యం కోసం పక్క రాష్ట్రాలకో లేదా హైదరాబాద్కో వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలగా చెప్పవచ్చు.
అభివృద్ధి పనుల ప్రారంభం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ‘కడా’ ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు సభా స్థలిని పర్యవేక్షించారు. తమ అభిమాన నేత, ముఖ్యమంత్రి రాకతో కొడంగల్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.
