Telangana High Court: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు కేటీఆర్ మరియు హరీశ్రావులకు రాష్ట్ర హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అత్యంత కీలకమైన ‘మిలియన్ మార్చ్’ సందర్భంగా నమోదైన కేసుల నుంచి కోర్టు వీరిని విముక్తి చేసింది. ఈ మేరకు వారిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2011లో హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఉమ్మడి రాష్ట్రంలో మిలియన్ మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారీ ఎత్తున నిరసనకారులు తరలిరావడంతో ట్యాంక్ బండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు దర్యాప్తు జరిపి, కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులను నిందితులుగా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు.
అయితే, సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. నిందితులుగా చేర్చబడిన నాయకులకు ఆనాటి అల్లర్లతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, తగిన ఆధారాలు లేవని భావిస్తూ వారిపై ఉన్న కేసులను కొట్టేసింది. ఈ తీర్పుతో గత 15 ఏళ్లుగా సాగుతున్న ఈ పాత కేసుల నుంచి బిఆర్ఎస్ అగ్రనేతలకు విముక్తి లభించినట్లయింది.
