Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ప్రస్తుతం ఊహించని విధంగా మారుతోంది. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అకస్మాత్తుగా వర్షాలు పలకరిస్తున్నాయి. అగ్నిప్రవేశం చేసినట్లుగా పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 44°C వరకు చేరుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే, వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఛత్తీస్గఢ్ నుండి కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన వాతావరణ ద్రోణి ప్రభావంతో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం: ఎండతో పాటు వాన ముప్పు
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో మంగళ, గురువారాల్లో జల్లులు పడే ఛాన్స్ ఉండగా, బుధవారం మాత్రం పొడి వాతావరణం ఉంటుందని అంచనా. అయితే, తీర ప్రాంతాల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఉక్కపోత, అసౌకర్యంగా అనిపించే పరిస్థితి ఉంటుంది.
రాయలసీమలో పరిస్థితి ఏమిటి?
రాయలసీమ వాసులకు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండబోతోంది. రాబోయే రెండు రోజుల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చు. బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రత వల్ల పగటిపూట బయటకు వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచింది.
తెలంగాణలో వడగళ్ళ వానలు!
తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం భిన్నంగా ఉండబోతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని తూర్పు, పశ్చిమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ళ వానలు పడే సూచనలు ఉన్నాయి. ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయని, గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండకపోయినా ఉక్కపోత అధికంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
