Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు ఇది నిజంగా శుభవార్త. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మెల్లగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ విలువ పెరగడం, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఫలితంగా అంతర్జాతీయంగా బంగారం ధర 1.21 శాతం తగ్గి ఔన్సుకు 4,821 డాలర్లకు చేరగా, వెండి ధర కూడా 2.05 శాతం మేర క్షీణించింది. దీని ప్రభావం మన దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది.
నేడు ఏప్రిల్ 21వ తేదీన హైదరాబాద్లో ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 1,55,280 గా ఉంది. అదేవిధంగా, నగలు చేయించుకోవడానికి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,42,340 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,16,460 గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,55,430 గా ఉండగా, ముంబై మరియు చెన్నైలలో కూడా ధరలు స్వల్ప మార్పులతో ఇంచుమించు ఇలాగే ఉన్నాయి.
ఇక వెండి విషయానికి వస్తే ధరల్లో భారీ పతనం కనిపిస్తోంది. ఒకప్పుడు కిలో వెండి ధర ఏకంగా 4 లక్షల రూపాయల మార్కును తాకగా, ప్రస్తుతం అది లక్ష రూపాయల వరకు తగ్గిపోయింది. హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 2,79,900 వద్ద ఉండగా.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో రూ. 2,74,900 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల అక్షయ తృతీయ సందర్భంగా ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, మహిళలు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడంతో నగల దుకాణాలు కిటకిటలాడాయి. ఇప్పుడు ధరలు మరింత తగ్గడం విశేషం.
