Seethakka: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్)కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం తప్పుడు ఆరోపణలు చేస్తూ, తన ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తోందని ఆమె ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్దే బాధ్యతని, ఈ అసత్య పోస్టుల వల్ల తన పరువుకు భంగం కలిగిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 48 గంటల్లోగా ఆ అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించి, కేసీఆర్ స్వయంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు; ఒకవేళ గడువులోగా స్పందించని పక్షంలో చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వెనకాడబోనని ఆమె తీవ్రంగా హెచ్చరించారు.
