Harish Rao: వికారాబాద్ జిల్లా పరిగిలోని ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్ రావును, ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయంగా దుమారం రేపింది. నార్సింగి వద్ద వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు, శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించి కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాధితులను కలిసేందుకు వెళ్తున్న తమను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కనుమరుగైందని హరీశ్ రావు విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ధర్నాలు చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజిలెన్స్ విచారణలు, కేసులతో తమను భయపెట్టాలని చూస్తోందని, కానీ తాము దేనికీ వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. రైతుల కోసం పోరాటం కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మండిపడుతూ.. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తామని ఆయన పగటి కలలు కంటున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, కేవలం సింగిల్ డిజిట్ సీట్లకే ఆ పార్టీ పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
