Chandrababu Naidu

Amaravathi: ఆంధ్రుల కలల రాజధానిపై రాష్ట్రపతి సంతకం.. గెజిట్ విడుదల!

Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఎట్టకేలకు చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం-2026కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం ఆమోదముద్ర వేశారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో 2024 జూన్ 2 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా చట్టపరంగా రూపుదిద్దుకుంది. గత కొంతకాలంగా సాగుతున్న అనిశ్చితికి తెరదించుతూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఇప్పటికే ఆమోదం తెలిపాయి.

పార్లమెంటులో ఏకగ్రీవ మద్దతు

అమరావతిని రాజధానిగా గుర్తించాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5(2)ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లుపై లోక్‌సభ మరియు రాజ్యసభల్లో సుదీర్ఘ చర్చ జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మినహా, దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి జై కొట్టాయి. పార్లమెంటు ఆమోదం పొందిన వెంటనే కేంద్ర న్యాయశాఖ దీనిని రాష్ట్రపతి వద్దకు పంపగా, ఆమె వెంటనే సంతకం చేయడంతో అమరావతి అజేయ నగరంగా అవతరించింది.

చట్టబద్ధమైన భరోసా

తాజా సవరణ ప్రకారం, అమరావతి రాజధాని పరిధిలోకి సీఆర్‌డీఏ (CRDA) చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ వస్తాయి. భవిష్యత్తులో ఈ రాజధాని విషయంలో ఎలాంటి మార్పులు చేయాలన్నా అది కేవలం పార్లమెంటు పరిధిలోనే ఉంటుంది. రాష్ట్ర శాసనసభ చేసే సవరణలకు ఇకపై చట్టబద్ధమైన విలువ ఉండదు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అమరావతిపై పూర్తి భరోసా కలుగనుంది. రాజధాని నగరం అజరామరంగా వెలుగొందడానికి ఈ చట్టం పునాది వేసింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు

రాజధాని కల సాకారమైన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మరియు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల విజయమని, ముఖ్యంగా ఐదేళ్లుగా అకుంఠిత దీక్షతో పోరాటం చేసిన అమరావతి రైతుల త్యాగానికి దక్కిన గౌరవమని ఆయన కొనియాడారు. మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని, అమరావతి రైతుల సహనమే ఈ విజయానికి మూలమని హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *