Weather Update

Weather Update: భగభగమంటున్న భానుడు.. ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక!

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. మార్చి నెల ఇంకా ముగియకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎండలు 40 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏప్రిల్ మరియు మే నెలల్లో ఎండలు ఇంకా ఏ స్థాయిలో ఉంటాయోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా శనివారం రాష్ట్రంలోని సుమారు 90 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. అటు తెలంగాణలోనూ పరిస్థితి ఏమీ భిన్నంగా లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు వికారాబాద్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి, సంగారెడ్డి జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించగా, మిగిలిన ప్రాంతాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.

ఈ తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిది. వృద్ధులు మరియు చిన్నపిల్లలు ఎండదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉన్నందున వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు రోజంతా మంచినీరు, పండ్ల రసాలు, మజ్జిగ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ఎండలో ప్రయాణించాల్సి వస్తే గొడుగు లేదా టోపీ ధరించడం, కాటన్ దుస్తులు వేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *