Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగారు. జగిత్యాల వెళ్లిన ఆయన, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరియు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సాకేవత్తో కలిసి జీవన్రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సుదీర్ఘంగా చర్చించారు.
జీవన్రెడ్డికి దాదాపు 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన తమకు తండ్రి లాంటి వారని మహేశ్కుమార్ గౌడ్ కొనియాడారు. రాజకీయాల్లో ఎంతో సీనియారిటీ ఉన్న ఆయన పార్టీకి ఎంతో అవసరమని, కాంగ్రెస్ పార్టీ ఆయన్ను వదులుకోవాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని కారణాల వల్ల ఆయన ఇబ్బంది పడ్డ మాట నిజమేనని, అయితే పార్టీని వీడే ఆలోచనను వెనక్కి తీసుకోవాలని తాము కోరినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసిన జీవన్రెడ్డి వంటి నాయకులు పార్టీలోనే ఉండాలని అధిష్టానం కూడా కోరుకుంటోందని నేతలు తెలిపారు. త్వరలోనే అన్ని సమస్యలు సర్దుకుంటాయని, జీవన్రెడ్డి పార్టీలోనే కొనసాగుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్ నేతను బుజ్జగించేందుకు రాష్ట్ర స్థాయి నేతలు స్వయంగా వెళ్లడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
