Maoist: తెలంగాణ రాష్ట్ర రాజకీయ మరియు భద్రతా చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. సుమారు 126 మంది మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి, ప్రజాస్వామ్య మార్గంలోకి వస్తున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. వీరంతా తమ వద్ద ఉన్న ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి, జనజీవన స్రవంతిలో కలవనున్నారు. ముఖ్యంగా దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఒకేసారి లొంగిపోవడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో శాంతిభద్రతల పరంగా ఒక శుభపరిణామంగా భావిస్తున్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పించి, వారు సాధారణ జీవితం గడపడానికి అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందించనుంది. ఆయుధాలతో సహా వారు బయటకు రావడం మావోయిస్టు ఉద్యమానికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ కీలకమైన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్, బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలను, వారికి ప్రభుత్వం ప్రకటించే ప్యాకేజీలను ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది. ఈ భారీ లొంగుబాటుతో అడవి బాట పట్టిన వారు తిరిగి సొంత గూటికి చేరుకుంటుండటంతో వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
