Hyderabad: హైదరాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఆదివారం ఒక భారీ ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన ఒక ఖరీదైన ఫెరారీ కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టి, అదుపు తప్పి అవతలి వైపు నుంచి వస్తున్న మరో కారుపైకి దూసుకెళ్లింది. ఈ వేగానికి ఆ కారును వెనుక నుంచి వస్తున్న ఇంకో కారు కూడా ఢీకొనడంతో వరుసగా మూడు వాహనాలు దెబ్బతిన్నాయి.
ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే, కోట్లు విలువ చేసే ఫెరారీ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే, అదృష్టవశాత్తూ కార్లలో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. అందరూ సురక్షితంగా బయటపడటంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. దెబ్బతిన్న వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అసలు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
