Kurnool: కర్నూలు జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఒక అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణకు, నాణ్యమైన విద్యకు మారుపేరుగా నిలవాల్సిన ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాలలో తోటి విద్యార్థులే మృగాళ్లలా ప్రవర్తించారు. ఆలూరు మండలం అరికేరాలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక చిన్నారిపై సీనియర్ విద్యార్థులు కొద్దిరోజులుగా లైంగిక దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
పాఠశాల ఆవరణలోనే జరుగుతున్న ఈ అఘాయిత్యాన్ని భరించలేక, బాధిత విద్యార్థి తనపై జరుగుతున్న వేధింపుల గురించి పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. పైగా, శుక్రవారం రాత్రి సీనియర్ విద్యార్థులు మరోసారి ఆ బాలుడిపై అమానుషంగా ప్రవర్తించడంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో బాలుడి ఆరోగ్యం క్షీణించడాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది, విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా అత్యంత గోప్యంగా ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే, ఈ విషయం కాస్తా బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పాఠశాలలో ఇటువంటి పైశాచిక చర్యలు చోటు చేసుకోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
