Hyderabad: హైదరాబాద్ శివారులో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ (SOT) పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు రెండున్నర కిలోల ఓపియం (OPM) డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు రాజస్థాన్కు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ను తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల వద్ద నుంచి డ్రగ్స్తో పాటు మరికొన్ని కీలక వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ దందాను అడ్డుకునేందుకు ఎస్ఓటీ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. పట్టుబడిన నిందితుల వెనుక ఎవరెవరు ఉన్నారు? వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం లోతుగా విచారణ జరుపుతున్నారు.
