Plane Crash: కొలంబియాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర విమాన ప్రమాదం ఆ దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వెనిజులా సరిహద్దు ప్రాంతంలో విమానం కుప్పకూలిన ఈ దుర్ఘటనలో కొలంబియా శాసనసభ్యుడు డియోజీనెస్ క్వింటరోతో సహా మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 13 మంది ప్రయాణికులు ఉండగా, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు.
ప్రమాదం జరిగిన తీరు..
ప్రభుత్వ విమానయాన సంస్థ ‘సటేనా’కు చెందిన ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:42 గంటలకు కుకుటా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం ఇది 12:05 గంటలకు ఒకానాలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే టేకాఫ్ అయిన కేవలం 9 నిమిషాలకే, అంటే 11:54 గంటల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. కొద్దిసేపటికే వెనిజులా సరిహద్దులోని లా ఫ్లాయా డెబెలెన్ అనే మారుమూల ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Danam Nagender: నాపై ఉన్న అనర్హత పిటిషన్ను కొట్టివేయండి.. స్పీకర్కు దానం నాగేందర్ విజ్ఞప్తి
సహాయక చర్యలు..
విమానం కూలిపోయిన వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకునేలోపే విమానం పూర్తిగా కాలి బూడిదయ్యింది. లోపల ఉన్న వారెవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేకుండా పోయిందని అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితులా అనే కోణంలో కొలంబియా సివిల్ ఏవియేషన్ అథారిటీ విచారణ చేపట్టింది. ఈ ఘటనతో కొలంబియాలో విషాద ఛాయలు అలముకున్నాయి.
