Bhatti Vikramarka: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే తమ ధ్యేయమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన, ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో, మంత్రులు తనతో భేటీ అవ్వడంపై జరుగుతున్న ప్రచారాన్ని భట్టి తోసిపుచ్చారు. తామంతా ఒకే కుటుంబంలా, సమష్టిగా పనిచేస్తున్నామని.. సీఎం అందుబాటులో లేనప్పుడు పాలనాపరమైన అంశాలపై చర్చించుకోవడానికి మంత్రులు తనను కలవడం చాలా సహజమని ఆయన క్లారిటీ ఇచ్చారు. అనవసరపు వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
గత రెండు ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని కీలక పథకాలు:
- మహాలక్ష్మి పథకం: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.
- ఉచిత విద్యుత్: 200 యూనిట్ల లోపు వాడే కుటుంబాలకు జీరో కరెంట్ బిల్లు.
- సన్న బియ్యం: కోటి 3 లక్షల కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ.
- విద్య & నైపుణ్యం: యువత కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు.
- ఆర్థిక చేయూత: స్వయం సహాయక సంఘాలకు రూ.6 వేల కోట్ల వడ్డీలేని రుణాలు.
ఇది కూడా చదవండి: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు హాజరైన మాజీ ఎంపీ సంతోష్ రావు
సింగరేణి టెండర్ల వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలను భట్టి విక్రమార్క ఖండించారు. అవన్నీ కేవలం కట్టుకథలేనని, సింగరేణిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేసిందని, అదే ఊపుతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని భట్టి విక్రమార్క వెల్లడించారు.
