Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ కీలక నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ రావు మంగళవారం సిట్ (SIT) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.
ఈ విచారణకు సంబంధించి సిట్ అధికారులు నిన్ననే సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయనకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా లేదా అనే కోణంలో అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే రాష్ట్రంలోని పలువురు కీలక వ్యక్తుల పేర్లు బయటకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ఇదే కేసులో గతంలోనే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను కూడా సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. వారి నుంచి కీలక వాంగ్మూలాలను సేకరించిన అధికారులు, ఇప్పుడు సంతోష్ రావును విచారించడం ద్వారా మరిన్ని వివరాలను రాబట్టాలని చూస్తున్నారు. విచారణ అనంతరం ఆయనను మళ్లీ పిలుస్తారా లేక ఇక్కడితో సరిపెడతారా అనేది వేచి చూడాలి.
