Telangana: గణతంత్ర దినోత్సవం (Republic Day 2026) వేడుకలకు దేశమంతా సిద్ధమవుతున్న వేళ, తెలంగాణ మద్యం ప్రియులకు ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రతి ఏటా జనవరి 26న జాతీయ పండుగను పురస్కరించుకుని పాటించే ‘డ్రై డే’ (Dry Day) నిబంధన ఈ ఏడాది కూడా అమలులో ఉండనుంది. ఈ మేరకు రేపు అంటే సోమవారం (జనవరి 26, 2026) రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు.
రేపు ఉదయం నుంచే రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు, బార్లు, పబ్లు మరియు క్లబ్బులు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ సెలవు దినం కావడంతో శాంతిభద్రతలను కాపాడేందుకు ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి దొడ్డిదారిలో విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్సులను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Padma Shri Awards: పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం!
ఈ వార్త తెలుసుకున్న మందుబాబులు ఇప్పటికే తమకు కావలసిన స్టాక్ను సిద్ధం చేసుకునే పనిలో పడటంతో ఈరోజు సాయంత్రం మద్యం దుకాణాల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు, రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం భారీ తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్స్లో పోలీసులు రిహార్సల్స్ నిర్వహించడంతో పాటు డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు మరియు బహిరంగ ప్రదేశాల్లో నిఘా పెంచారు.
