Tenali

Tenali: తెనాలిలో సంచలనం.. కూలి మహిళ ఇంట్లో రూ.1.5 కోట్ల విలువైన బంగారం, ఆస్తులు!

Tenali: గుంటూరు జిల్లా తెనాలిలో నివసించే ఒక సామాన్య మహిళ ఇంట్లో అసాధారణ రీతిలో భారీ సంపద బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పట్టణంలోని బాలాజీరావుపేట సమీపంలో గల మహేంద్ర కాలనీలో ఒక చిన్న రేకుల షెడ్డులో ఒంటరిగా ఉంటూ, రోజువారీ కూలి పనులు చేసుకునే పేరిబోయిన గురవమ్మ అనే వృద్ధురాలి నివాసమే ఈ సంచలనానికి దారితీసింది. ఆ ఇంట్లో నిగూఢంగా దాగిన బంగారం, వెండిని చూసి సాక్షాత్తూ పోలీసులే విస్మయానికి గురయ్యారు.

జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు అందిన రహస్య సమాచారం ప్రకారం, అక్కడ ‘రైస్ పుల్లింగ్’ వంటి మోసపూరిత కార్యకలాపాలు జరుగుతున్నాయన్న అనుమానంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఒక్కసారిగా గురవమ్మ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 800 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి ఆభరణాలతో పాటు రూ. 5.65 లక్షల నగదు లభ్యమయ్యాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ. 1.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం కూలి పనులు చేసుకునే మహిళ వద్ద ఇంతటి భారీ సంపద ఉండటంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ దీనిపై విచారణ చేపట్టారు.

Also Read: Delhi Airport: ఢిల్లీలో ఎయిర్‌పోర్టులో అస్థిపంజరం కలకలం!

ఈ సంపద గురించి పోలీసులు ఆమెను ప్రశ్నించగా, అదంతా విజయవాడలో నివసించే తన అల్లుడిదని ఆమె సమాధానమిచ్చింది. తన అల్లుడు భవానీపురంలోని ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో భాగస్వామిగా ఉన్నాడని, అతను సంపాదించిన ఆస్తిని ఇక్కడ భద్రపరిచాడని ఆమె పేర్కొంది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడి కోసం విజయవాడకు వెళ్లారు. అయితే పోలీసుల రాకను ముందే పసిగట్టిన అల్లుడు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు.

ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. ఆ అల్లుడు నిజంగానే అంత ఆస్తిని సంపాదించాడా? లేక ఎవరైనా బడా వ్యాపారవేత్తలు లేదా పారిశ్రామికవేత్తలకు బినామీగా ఉంటూ ఈ అక్రమ ఆస్తులను దాచాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా రైస్ పుల్లింగ్ ముఠాలతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై కూపీ లాగుతున్నారు. పరారీలో ఉన్న వ్యక్తి పట్టుబడితేనే ఈ భారీ సంపద వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *