Viral News: తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కుముందుగానే మొక్కులు చెల్లించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా భక్తులు తమ బరువుకు సమానంగా బెల్లాన్ని (బంగారం) దేవతలకు నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ ఆచారం. అయితే, ఈ వేడుకల సమయంలో టాలీవుడ్ నటి టీనా శ్రావ్య చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది.
నటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కతో కలిసి జాతరకు వచ్చారు. అయితే, అక్కడ ఆమె తన కుక్కకు సమానమైన బరువుతో తులాభారం వేయడం చర్చనీయాంశంగా మారింది. తక్కెడలో ఒకవైపు కుక్కను కూర్చోబెట్టి, మరోవైపు బెల్లాన్ని వేసి ఆమె తన మొక్కును తీర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
సాధారణంగా మనుషులు తమ ఆరోగ్యం కోసమో లేదా మొక్కుల కోసమో తులాభారం వేస్తారని, కానీ ఇలా జంతువులకు తులాభారం వేయడం ఏంటని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఆదివాసీ దేవతలను మరియు భక్తుల మనోభావాలను అవమానించడమేనని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవతలకు సమర్పించే పవిత్రమైన బెల్లాన్ని ఇలా జంతువుల బరువుతో కొలవడం సరైన పద్ధతి కాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఈ వివాదం ముదరడంతో టీనా శ్రావ్య తల్లి దీనిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తమ పెంపుడు కుక్కకు సంబంధించి ఒక మొక్కు ఉందని, అందుకే ఈ ఏడాది ఆ మొక్కును తీర్చుకున్నామని ఆమె వివరించారు. ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యవహారంపై విమర్శలు ఆగడం లేదు. జాతర పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు.
కుక్కపై ఇంత ప్రేమనా?
మేడారం జాతరలో ఆమె పెంపుడు కుక్కకు తులాభారం వేయడంతో #thegreatpreweddingshow హీరోయిన్ టీనా శ్రావ్యపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
పెంపుడు కుక్కకు తులాభారం వేయడం సరికాదని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని విమర్శిస్తున్నారు.#medaramjathara pic.twitter.com/MkHg6zrMbV
— greatandhra (@greatandhranews) January 21, 2026
