Telangana Municipal Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం సమ్మక్క-సారక్క జాతర సాక్షిగా ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ కూడా పంపింది. మరో మూడు రోజుల్లోనే అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
జిల్లాల పునర్విభజనకు కూడా గ్రీన్ సిగ్నల్
ఈ కేబినెట్ సమావేశంలో కేవలం ఎన్నికలే కాకుండా, జిల్లాల పునర్విభజన వంటి అతిముఖ్యమైన అంశాలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలపడం విశేషం. దీంతో పాలనాపరంగా రాష్ట్రంలో మరిన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఎన్నికల నిర్వహణతో పాటు జిల్లాల మార్పులు చేర్పులపైనా ప్రభుత్వం స్పష్టమైన అడుగులు వేస్తోంది.
ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్ నగరంలో భారీగా సీఐల బదిలీలు
రిజర్వేషన్లు ఖరారు.. మొదలైన పైరవీలు
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి మేయర్ మరియు చైర్పర్సన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఏయే సీటు ఎవరికి దక్కుతుందనే దానిపై క్లారిటీ వచ్చింది. దీంతో టికెట్ల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీ అగ్రనేతల చుట్టూ తిరుగుతూ, తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల చర్చే సాగుతోంది.
పార్టీల మధ్య హోరాహోరీ పోరు
మున్సిపాలిటీల్లో పాగా వేయడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంటే, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ మరియు బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. గడువు ముగిసిన మున్సిపాలిటీల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు నాయకులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలుపెట్టారు. మరి కొద్దిరోజుల్లోనే తెలంగాణ అంతటా ఎన్నికల హడావుడి మరింత పెరగనుంది.
