Medaram Jatara 2026: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో వన దేవతలైన సమ్మక్క, సారలమ్మ రెండేండ్లకోసారి కోట్లాది మంది భక్తులతో మొక్కులు పొందుతారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన జాతరగా మేడారానికి గుర్తింపును దక్కింది. అంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ మేడారం జాతర మళ్లీ ఈ జనవరి నెలలోనే జరుగుతున్నది. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్నది. అయితే జాతరకు ఒక నెల ముందు నుంచే లక్షలాది మంది మేడారానికి పోటెత్తడం విశేషం.
Medaram Jatara 2026: ఇంతటి విశేష పాశస్త్యం కలిగిన మేడారం జాతరకు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక 2014లో ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర జాతరగా గుర్తించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సారి రేవంత్రెడ్డి సర్కారు మరిన్ని నిధులు కేటాయించి మరింత శోభను తీసుకొచ్చారు. మేడారం జాతర, సమ్మక్క, సారలమ్మ చారిత్రక నేపథ్యం చాలా మందికి తెలిసిందే. తెలియని వారికి మరోసారి తెలిపేందుకే ఈ ప్రయత్నం.
Medaram Jatara 2026: అది నేటి జగిత్యాల జిల్లా పరిధిలోని అటవీప్రాంతం. అక్కడి పొలవాసను గిరిజన దొర మేడరాజు ఉండేవారు. ఆయన తన గిరిజన కోయ దొరల పరివారంతో కలిసి అడవికి వేటకు బయలుదేరి వెళ్లారు. వారికి ఆ అడవిలో పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసికూన కనిపించిందంట. ఆ పసికూనను ఆ కోయ దొరలు తమ నివాసాలకు తీసుకొచ్చారట. ఆ పసికూనను వారు అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. అలా ఆ కూన తమ జీవితంలోకి వచ్చిన తర్వాత వారికి అన్నింటా కలిసొచ్చిందని నమ్మారు.
Medaram Jatara 2026: మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అన్న నామకరణం చేశారు. పెరిగి పెద్దదయ్యాక సమ్మక్కను తన మేనల్లుడు, మేడారం సామంతరాజైన పగిడిద్దరాజుకు ఇచ్చి మేడరాజు పెళ్లి జరిపించారు. సమ్మక్క-పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. పగిడిద్దరాజు కాకతీయ రాజుల సామంతరాజుగా ఉండేవారు.
Medaram Jatara 2026: కరువు పరిస్థితుల కారణంగా కాకతీయ రాజులకు కొన్నేళ్లపాటు శిస్తు కట్టలేకపోయాడు. అదే విధంగా మేడరాజుకు ఆశ్రయం కల్పించాడని కాకతీయ రాజులకు కోపం వచ్చింది. మేడరాజు అక్కడి కోయ గిరిజనులకు తిరుగుబాటు పాఠాలు చెప్తున్నాడని భావించారు. దీంతో పగిడిద్దరాజుపై కాకతీయ రాజైన ప్రతాపరుద్ర మహారాజు యుద్ధాన్ని ప్రకటించారు.
Medaram Jatara 2026: కాకతీయ రాజుల సైన్యం ధాటికి తట్టుకోలేక యుద్ధంలో పగిడిద్దరాజు సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు వీరమరణం పొందారు. ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క కొడుకైన జంపన్న అక్కడి సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి ఆ వాగుకు జంపన్నవాగుగా పేరుపడింది. ఆయన రక్తం జలధారయై వాగు నీరు ఎరుపు రంగులో ప్రవహిస్తాయని భక్తులు నమ్ముతారు.
Medaram Jatara 2026: తన కుటుంబ సభ్యుల మరణవార్త విన్న సమ్మక్క కాకతీయులపై యుద్ధానికి వెళ్తుంది. కాకతీయుల సైన్యం ఆమె విరుచుకుపడింది. ఆమె వీరత్వాన్ని చూసిన ప్రతాపరుద్రుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇదే సమయంలో సమ్మక్క వీరత్వంపై ప్రతాపరుద్రుడు ఆలోచిస్తుండగా, దొంగచాటుగా వచ్చిన ఓ సైనికుడు సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడిచాడు. తీవ్రగాయాలపాలైన సమ్మక్క మేడారం గ్రామానికి సమీపంలోని ఈశాన్య వైపు ఉన్న చిలుకలగుట్టకు చేరుకొని అదృశ్యమైంది.
Medaram Jatara 2026: ఆ తర్వాత చిలుకలగుట్ట వద్ద కుంకుమ భరిణి కనిపించిందంట. దానిని చూసిన ప్రతాపరుద్రుడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాప పడ్డాడట. ఆ తర్వాత నుంచి ప్రతాపరుద్రుడు సమ్మక్కను దేవతగా భావంచి, ఆమెకు భక్తుడిగా మారిపోయాడు. ఆ వెంటనే కోయ దొరలు చెల్లించాల్సిన కప్పాన్ని ప్రతాపరుద్రుడు రద్దు చేసిండట. రెండేండ్లకోసారి అక్కడ జాతర నిర్వహించాలని ఆదేశించాడు. ఇలా రెండేండ్లకోసారి మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర గొప్పగా కొనసాగుతూ వస్తున్నది.
