Annamalai: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై మరియు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధినేత రాజ్ థాకరే మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముంబై వేదికగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
వివాదం ఎక్కడ మొదలైంది?
ముంబైలో ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో రాజ్ థాకరే అన్నామలైని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నామలై పేరును ‘రసమలై’ అని ఎగతాళి చేస్తూ.. ముంబై విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఆయనెవరని ప్రశ్నించారు. అంతేకాకుండా, గతంలో దక్షిణ భారతీయులకు వ్యతిరేకంగా వాడిన “హటావో లుంగీ, బజావో పుంగీ” అనే నినాదాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ వివాదాన్ని రాజేశారు. తమిళ దిగ్గజం కామరాజ్ గురించి అన్నామలై చేసిన వ్యాఖ్యలను కూడా మరాఠీ గౌరవానికి ముడిపెడుతూ విమర్శలు గుప్పించారు.
బెదిరింపులకు భయపడను: అన్నామలై ధీటుగా సమాధానం
రాజ్ థాకరే వ్యాఖ్యలపై అన్నామలై సోమవారం ఘాటుగా స్పందించారు. “నన్ను బెదిరించడానికి ఆదిత్య థాకరే, రాజ్ థాకరే ఎవరు?” అని ఆయన ప్రశ్నించారు. ముంబైకి వస్తే తన కాళ్లు నరికివేస్తామంటూ వస్తున్న బెదిరింపులను ఆయన తిప్పికొట్టారు. “నేను ముంబైకి వస్తాను.. దమ్ముంటే నా కాళ్లు నరకండి” అని సవాల్ విసిరారు. తాను ఒక రైతు బిడ్డనని, ఇలాంటి రాజకీయ బెదిరింపులకు భయపడి ఉంటే తన సొంత గ్రామంలోనే ఉండిపోయేవాడినని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Anil Ravipudi: కొన్ని సందర్భాల్లో మాటలు అవసరం లేదు.. మెగా హగ్ వైరల్
తమిళులను అవమానిస్తున్నారు..
తనపై జరుగుతున్న దాడులు కేవలం వ్యక్తిగతమైనవి కావని, ఇది తమిళులను మరియు వారి సంస్కృతిని (ధోతీ, లుంగీ వంటి దుస్తులను) అవమానించడమేనని అన్నామలై ఆరోపించారు. ముంబై నగరం ప్రపంచ స్థాయికి చేరడంలో మరాఠీ ప్రజల కష్టం ఎంతో ఉందని తాను కూడా నమ్ముతానని, అయితే తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో తనను విమర్శించే డీఎంకే, ఇప్పుడు ముంబైలో తనను వ్యతిరేకిస్తున్న శివసేన (యుబిటి)తో పొత్తు పెట్టుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఎన్నికల నేపథ్యంలోనే ఈ రచ్చ?
జనవరి 15న ముంబై, పూణే సహా 29 మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సెంటిమెంట్లను రగిల్చి ఓట్లను దండుకోవడానికే రాజ్ థాకరే పాత నినాదాలను వాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బీజేపీ కూడా అన్నామలై వంటి నేతలను రంగంలోకి దించి వలస ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పోరు రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
