Ponguleti Srinivas: తెలంగాణ రాష్ట్రంలో స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ రూపురేఖలు త్వరలో పూర్తిగా మారిపోనున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అత్యంత పారదర్శకంగా మరియు అవినీతికి తావులేకుండా సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ కార్యాలయాలను తలపించేలా ‘సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను’ నిర్మిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
దశల వారీగా అత్యాధునిక భవనాలు ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణంలో రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం మూడు దశల్లో ఈ భవనాలను నిర్మించనుంది. మొదటి దశలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో, రెండో దశలో జిల్లా కేంద్రాల్లో, ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో ఈ సమీకృత భవనాలు అందుబాటులోకి రానున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలో సోమవారం మంత్రి గారు ఈ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 39 కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి ఈ భవనాలను నిర్మిస్తున్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా బిల్డర్ల సహకారంతో వీటిని నిర్మిస్తుండడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Gujarat Investment: గుజరాత్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అదానీ, అంబానీ
ప్రజా సౌకర్యాలే ప్రాధాన్యం ఈ నూతన భవనాల్లో కేవలం అధికారులు మాత్రమే కాకుండా, కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజల కోసం అన్ని రకాల వసతులు ఉంటాయి. ముఖ్యంగా మహిళలకు, పసిపిల్లల తల్లులకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 2 నాటికి గచ్చిబౌలిలోని తొలి సమీకృత భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రిజిస్ట్రేషన్ శాఖను కేవలం ఆదాయం ఇచ్చే విభాగంగా కాకుండా, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు.
పేదల పక్షపాతిగా ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడటంలో కఠినంగా వ్యవహరిస్తూనే, పేద ప్రజల ప్రయోజనాలను రక్షించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ఒకవేళ ప్రభుత్వం ఏదైనా అవసరం కోసం తీసుకోవాల్సి వస్తే, ఆ పేదలకు తగిన పరిహారం చెల్లించడంతో పాటు ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. చివరగా, త్వరలో జరగబోయే మేడారం జాతర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.
