Priyanka Gandhi son Engagement: నెహ్రూ-గాంధీ కుటుంబం మరో శుభకార్యానికి వేదిక కాబోతోంది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాల కుమారుడు రేహాన్ వాద్రా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన చిరకాల మిత్రురాలు, వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన అవివా బేగ్తో ఆయన ఏడడుగులు వేయనున్నారు. గత ఏడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట, ఇరు కుటుంబాల అంగీకారంతో తమ బంధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవలే అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం వేడుకగా జరిగినట్లు జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. రేహాన్ స్వయంగా అవివాకు ప్రపోజ్ చేయడం, దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెద్దల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు సమాచారం.
అయితే ఈ శుభవార్తపై అటు గాంధీ కుటుంబం కానీ, ఇటు వాద్రా కుటుంబం కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Teja Sajja: జై హనుమాన్ నుంచి తప్పుకున్న తేజ సజ్జ?
25 ఏళ్ల రేహాన్ వాద్రాకు తన తాతయ్య, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ పోలికలు ఉన్నాయని నెటిజన్లు తరచూ అంటూ ఉంటారు. కేవలం రూపంలోనే కాదు, అభిరుచుల్లో కూడా ఆయన తాతయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. రాజీవ్ గాంధీకి ఫొటోగ్రఫీ అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. అదే బాటలో రేహాన్ కూడా విజువల్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. వైల్డ్ లైఫ్, స్ట్రీట్ మరియు కమర్షియల్ ఫొటోగ్రఫీలో ఆయనకు విశేషమైన ప్రవేశం ఉంది. కుమారుడిలోని సృజనాత్మకతను గుర్తించిన తల్లి ప్రియాంకా గాంధీ, చిన్నప్పటి నుంచే అతడిని ప్రోత్సహిస్తూ వచ్చారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రేహాన్ కాబోయే భార్య అవివా బేగ్ కూడా ఫొటోగ్రఫీ రంగంలోనే ఉండటం. ఒకే రకమైన అభిరుచులు ఉన్న వీరిద్దరి మధ్య ఫొటోగ్రఫీనే వారధిగా నిలిచింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి, అది బలమైన ప్రేమగా రూపాంతరం చెందింది. రేహాన్ సోదరి మిరాయా వాద్రా కూడా ఈ వేడుకల్లో సందడి చేయనున్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తి ఉన్న కుటుంబంలో ఈ పెళ్లి బాజాలు మోగనుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
